Sunday, 20 September 2026

చరిత్ర ఉక్కు కౌగిలిలో …

          


     రష్యా, యుక్రెయిన్ల మధ్య దాదాపు నాలుగేళ్లుగా  సంకుల సమరం సాగుతోంది.లక్షలాది మంది సైనికులు, ప్రజలు రెండు వైపులా ప్రాణాలు కోల్పోతున్నారు. 1991 వరకు సోవియెట్ యూనియన్లో అంతర్భాగంగా ఉన్న యుక్రెయిన్ రిపబ్లిక్ నేడు చారిత్రక అనుభవాల రాపిడిలో రష్యాను ధిక్కరిస్తూ ఉంది. స్టాలిన్ చేపట్టిన సమష్టి వ్యవసాయం దశలో బలవంతంగా ధాన్య సేకరణ వల్ల లక్షలాది  యుక్రెయిన్ ప్రజలు ఆకలి చావులకు గురయ్యారని చరిత్ర. కులక్కుల విప్లవ వ్యతిరేక కుట్ర ను అంతం చేయడానికే నిర్బంధ చర్యలు అవసరమయ్యాయని  సోవియెట్ యూనియన్ అనుకూల చరిత్రకారుల వాదన. పైగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుక్రెయిన్ ప్రజల్లో నాజీ అనుకూల ధోరణి నడిచిందని , దీనిని ఏ ప్రభుత్వం సహించలేదని వాదించారు.ఈ సంక్లిష్టమైన 

 చారిత్రక యుగంలో కోట్లాది  సోవియెట్ ప్రజలు ఫాసిస్టు వ్యతిరేక దేశభక్తియుత యుద్ధంలో అసువులు కోల్పోవటం కాదనలేని సత్యం. యుద్ధానంతర కాలంలో అప్పటిదాకా అంతర్లీనంగా ఉంటూ పెరిగిన యూదు వ్యతిరేకతను సోవియట్  రచయితలు గుర్తించారు.  మరో వైపు సోవియెట్ యూనియన్ లో పెరిగిన  బ్యూరోక్రాట్ నిరంకుశత్వం మేధావుల, వారి రచనల  అణచివేతకు దారితీసింది. నాటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో  పాశ్చాత్య దేశాలు సోవియట్ వ్యతిరేకత, యుద్ధ ఉన్మాదం చూపించాయి. పాస్టర్నాక్ ,సోల్జేనిట్సిన్ లాంటి సోవియట్ వ్యతిరేక రచయితలకు నోబెల్ బహుమతులిచ్చాయి. వ్యక్తివాదానికి పట్టం కట్టి సమష్టి వాదాన్ని దుయ్యబట్టాయి.


 ప్రచ్ఛన్న యుద్ధం ముగియగానే పాశ్చాత్య దేశాల చూపు దిక్కు మారింది. గతంలో చేసిన చైనా, కొరియా ,వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లో జోక్యం నుంచి లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఆక్రమణ నుంచి ఇటీవలి యుక్రెయిన్ - రష్యా యుద్ధం,  ఇజ్రాయెల్ కు మద్దతుగా పాలస్తీనీయుల ఊచకోత దాకా సామ్రాజ్యవాదుల గమనం మనకు విదితమే.ఇలాంటి సంక్లిష్టమైన చారిత్రక పరిస్థితిలో  వసీలీ గ్రోస్మాన్ నవలలు మానవ చరిత్ర తత్వాన్ని, వ్యక్తులకు రాజ్య వ్యవస్థ మధ్య జరిగే ఎడతెగని సంఘర్షణను మదిని, హృదిని కదిలించేలా చిత్రీకరించాయి.


 వసీలీ గ్రోస్మాన్ (1905-64)  నాటి  రష్యన్ సామ్రాజ్యంలో యుక్రెయిన్ ప్రాంతంలో బెర్డిచేవ్ గ్రామంలో ఒక యూదు కుటుంబంలో జన్మించారు. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత రచనా రంగానికి మారి సోవియట్ రచయిత, పాత్రికేయుడిగా ఖ్యాతి పొందారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రెడ్ స్టార్ పత్రికకు యుద్ధ విలేకరిగా పనిచేశారు. ఆయన యుద్ధానంతర కాలంలో రాసిన  ప్రఖ్యాత నవలలు Life and Fate( ‘జీవితం మరియు విధి), Everything Flows (ప్రతిదీ ప్రవహిస్తుంది ) అనేవి కృష్చేవ్ వచ్చిన తరువాత కూడా నాటి నిరంకుశ అధికారుల మూలానా ప్రచురణ కు నోచుకోలేదు. మొదట 1985 లో పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసి 1988 తర్వాత మాత్రమే రష్యాలో ముద్రితమయ్యాయి. “నా పుస్తకానికి స్వేచ్ఛ కావాలి అని కోరుతున్నా” అన్న గ్రోస్మాన్ 1964 లో కడుపులో కేన్సర్ వల్ల చనిపోయారు. 


వసీలీ గ్రోస్మాన్ రచించిన నవల “జీవితం మరియు  విధి” రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ ప్రజలు జర్మన్లకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన విజయానికి దర్పణం పడుతుంది. ఈ నవల టాల్స్టాయ్ “యుద్ధం   మరియు శాంతి” , షోలకోవ్ నవల  “ప్రశాంతంగా ప్రవహిస్తున్న డాన్’  లాంటి రచనల  తరహాలో ఐతిహాసిక రచన. ఈ నవల విశాలమైన కాన్వాస్ పై రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు,ప్రాంతాలు, జాతులు , దేశాల విధి ఏ విధంగా పెనవేసుకుపోయింది , మానవత, నాగరికతలు ఎలా మూల్యం  చెల్లించాయో చిత్రించింది. జర్మన్ దురాక్రమణ వాంఛ , బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ' ' సంతృప్తి పరిచే విధానం',  తప్పని సరి పరిస్థితిలో జర్మనీతో రష్యా చేసుకున్న ఒప్పందం , తరువాత జరిగిన మహా మారణ హొమం, జాతుల పరాధీనత, నిర్బంధ శిబిరాల్లో జనహననం చరిత్రకెక్కాయి. అలాగే సోవియట్ యూనియన్ లో కొత్త తరం అధికారుల అతి చర్యల  వల్ల పాత తరం విప్లవకారులు, రచయితలు, శాస్త్రవేత్తల ఉత్థాన పతనాలు చోటుచేసుకున్నాయి.


వసీలీ గ్రోస్మాన్ నవలలో  షాపోష్నికోవ్ సోదరీమణులు ఆయన ల్యుడ్మిల్ల మరియు ఎవ్జీనియాల జీవితాల్లోని విధివిలాసం కనిపిస్తుంది. ల్యుడ్మిల్ల భర్త విక్టర్ ష్రూమ్ ఒక అణుశాస్త్రవేత్త. పై అధికారుల పక్షపాత ధోరణి, చలవ మూలానా తన కెరీర్ లో కీర్తి, అపకీర్తులు రెండూ మూటగట్టుకున్నాడు. లుడ్మిల్ల తన కుమారుడు తోల్యాను యుద్ధంలో పోగొట్టుకుంది.అయినా భర్త   కష్ట నష్టాల్లో అండగా ఉంటుంది. ఈ అక్క చెల్లెళ్లలో మరింత  సాహసమున్న యెవ్జీనియ తన నివాస పత్రం కోసం అధికారులతో పోరాడుతుంది.ఆమె తన మొదటి భర్త ఎర్ర సైన్యంలో కొమిసార్ గా ఉన్న  క్రిమోవ్  ఒకే దారి మనస్తత్వం నచ్చక అతనికి దూరమై కల్నల్ నోవికోవ్ కు దగ్గర అవుతుంది.


విక్టర్ సహచరుల్లో అన్ని రకాల వాళ్ళు ,  సోకోలోవ్,  అన్నా లోశ్కోవా లాంటి మిత్రులు, షిషాకోవ్ లాంటి శత్రువులు, అవకాశవాదులు, చెపిజిన్ లాంటి నిరసనకారులు ఉంటారు. మాస్కోకి దూరంగా ఉన్న తరుణంలో  విక్టర్ , అతని మిత్రుల స్వేచ్ఛాయుత సంభాషణను వారిలో  ఎవరో అధికారులకు చేరవేయడం వల్ల విక్టర్ తన స్థానం కోల్పోతాడు . ఆ పరిస్థితిలో అతడి స్నేహితుడి  భార్య  మార్య ఇవనోవా సోకోలోవా విక్టర్ పట్ల సానుభూతి చూపిస్తుంది. ఆ క్రమంలో ఇద్దరూ దగ్గరైనా వారి బంధం వివాహ బంధం బయట ఉండటంతో విక్టర్ అపరాధ భావనకు లోనవుతాడు. విక్టర్ భార్య ల్యుడ్మిల్ల తన సొంత బాధలో ఉన్నప్పటికీ భర్త అంతర్గత సంఘర్షణను అర్థం చేసుకుంటుంది. ఆమె సోదరి అయిన యెవ్జీనియ మొదటి భర్త క్రిమోవ్ ద్రోహం ఆరోపణపై జైలుకు వెళ్లి, ఇంటరాగేషన్, చిత్రహింసలకు గురవుతాడు.అతడ్ని చూడటానికి యెవ్జీనియ వెళ్ళటం, ఉత్తరం రాయటం కల్నల్ నోవికోవ్ కు నచ్చదు.


    విక్టర్ పాత్ర తన తల్లి మృతి తర్వాత అపరాధ భావనకు గురవడం, స్టాలిన్ వ్యతిరేక డాక్టర్లు కుట్ర కేసులో లేఖపై వారికి వ్యతిరేకంగా సంతకం చేయడం, స్నేహితుడి భార్య పట్ల ప్రేమ విషయాల్లో రచయిత  వ్యక్తిగత జీవితానికి కూడా సామ్యముంది.


    ఈ నవలలో జర్మన్, రష్యన్ నిర్బంధ శిబిరాల్లో బానిసత్వ జీవిత చిత్రణ విపులంగా ఉంది. విభిన్న  వృత్తుల,జాతుల, మతాల ప్రజల  మానవత, ఆత్మగౌరవం భగ్నమై, వారి సమాధులు వారే తవ్వుకునే దయనీయ స్థితికి లోనై, వారిలో కొందరు  తెగించే చేసే తిరుగుబాట్లు నిర్దయగా అణచివేతకు గురయిన ఘటనల వర్ణన ఉంది. నేతల ఉన్మాదం ,జాతీయ దురహంకార ఫలంగా సామాన్యులు బలి అయిన విషాద ఘట్టం. అట్టి వారిలో పాత  బోల్షెవిక్ మోసోవ్కోయ్, మాజీ టాల్స్టాయ్ అనుయాయి ఇకిన్నికోవ్ మెర్జ్,  పాత మెంషివిక్క్కు చెర్నిసోవ్,  జర్మన్ల చేత చిక్కిన రష్యన్ ఆఫీసర్లు ఉంటారు. ఇక రష్యన్ నిర్బంధ శిబిరాల్లో అబర్చుక్ ( నవల్లో ల్యుడ్మిల్ల మొదటి భర్త), రూబ( మెడికల్ ఆర్డర్లీి), బర్కతోవ్ అనే నేరస్తుడు, మగర్ ( పాత బోల్షెవిక్ మరియు అబర్చుక్ టీచర్), మార్మికవాది ప్రిన్స్ డాల్గోర్కి, మాజీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ స్టెపనోవ్ మొదలగువారు ఉంటారు.క్రూర రాజ్యం చేత చిక్కి దీర్ఘకాలిక శిక్షలు, బలవంత నేరాంగీకారాలతో సాలెగూడులో చిక్కిన కీటకాలు పోలిన మానవులు.




  నాజీల నిర్బంధ శిబిరాల్లో మానవత మట్టి కలిసే  అత్యంత దయనీయ దృశ్యాలు గోచరిస్తాయి.పునరావాసం కల్పిస్తామని నమ్మించి లక్షలాది మందినీ వధ్యశాలలకు తీసుకెళతారు నాజీలు. బాధితుల వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలు , విలువైన వాటిని అన్నింటినీ చివరకు వారి జుత్తును కూడా తీసుకుని  వారి ఆత్మ గౌరవాన్ని ధ్వంసించి గ్యాస్ ఛాంబర్లలోకి పంపి  గత చరిత్రను రక్తం, కన్నీటితో తడిపారు నాజీ ముష్కరులు. రచయిత ఆ దృశ్యాలు వర్ణించిన తీరు పాఠకుల మదిని స్తంభింప చేసి , హృదిని నలిపివేస్తుంది. నాజీల  మస్తిష్క వల్మీకంలో  దాగిన ఆ సుప్త భుజంగాల  ద్వేష విషపూరిత  చర్యలను  గ్రోస్మాన్   మనకు  కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు.


దీనితో పాటు రష్యన్ యుద్ధ విమాన పైలట్ల, ఒక యుద్ధరంగంలో 6/1 ఇంట్లో చిక్కుకున్న 

సైనికుల, స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో రష్యన్ ప్రజల, సైనికుల, అధికారుల సాహస కృత్యాలను కూడా రచయిత వొళ్ళు గగుర్పొడిచేలా  వర్ణిస్తాడు. యుద్ధం మధ్యలో ఆహారం , నీరు కోసం ఘోరమైన వెతుకులాట, బంకర్లలో జీవితం, అంతటి సమరంలో పాల్గొనే యువజనుల మధ్య చిగురించే ప్రేమ , వారి త్యాగశీలత, హాస్య సన్నివేశాలు,  శతృ యుద్ధ ఖైదీ వైపు ఇటుక ముక్క కాకుండా రొట్టె ముక్క విసిరే ముసలి అవ్వ జాలి హృదయం, దేశంలో కొన్ని ప్రాంతాలు నాజీలతో చేతులు కలపడం, గత చెడు అనుభవాలతో కొందరి ద్రోహం ఇవన్నీ మన మెదళ్లలో సంకిష్ట ఆలోచనావేశాల మిశ్రమాన్ని కల్పిస్తాయి.


ఇంతే కాక ఈ నవలలో  జర్నలిస్టు మరియు  రచయిత అయిన  గ్రోస్మాన్ కవి హృదయంతో   చేసిన అద్భుత  యుద్ధ, ప్రకృతి వర్ణనలున్నాయి.

బైరోజ్కిన్ కాలికింద మెషిన్ గన్ పేలి “ నెల నుంచి అకస్మాత్తుగా పిచ్చుకల దండు దూసుకొచ్చినట్లుంది" ( పే.43)


 విమానం నడుపుతున్న లెఫ్టినెంట్ విక్టరోవ్ చూసిన దృశ్యాలు కదిలిస్తాయి.

" ప్రాచీన శిలలు ఈ సరస్సుల, వనాల మధ్య పరువులెట్టాయి; పొడవైన, నిటారు చెట్ల నుంచి చర్చిలు నిర్మితమయ్యాయి; వాటి నుంచి పడవల తెరచాపలు తయారయ్యాయి. ఈ వనాల మధ్య నుంచి బూడిద రంగు తోడేలు పరిగెత్తింది…నశించిన గతం సాదాగా, యవ్వనవంతంగా , అమాయకంగా గోచరించింది. అంతస్తుల్లోని కన్యలే కాకుండా బూడిద రంగు గడ్డాల వర్తకులు, మత పరిచారకులు, పెద్దలు అందరూ           మర తుపాకులు, డీసెల్ ఇంజన్లు, సినిమాల వేగవంత ప్రపంచం నుంచి వచ్చిన లౌక్యం గల యువ పైలట్ల కన్నా యవ్వనంతో కనిపించారు. వేగంగా, సన్నగా ,ఎత్తయిన బహుళ రంగుల కరకట్ల మధ్య , హరిత అరణ్యాల మధ్య,తేలికపాటి నీలి,ఎరుపు రంగుల అల్లిక నడుమ పారుతున్న వోల్గా ఈ నశించిన గతానికి ప్రతీకగా ఉంది.”

మరో  వర్ణనలో “ వనం కాలి కింద నుంచి లేచి చూపరిని  మింగేస్తుంది. జలాశయం అడుగు నుంచి నీటి పొర ద్వారా చూస్తూ భిన్న రకాల పురుగులు , పక్షులు, మంచు బిందువులు కప్పిన నాచును చూసి కొత్తగా, అసౌకర్యంగా భావిస్తాడు.వెలుగులోకి రాగానే స్వేచ్ఛా భావం,ప్రకృతిలో భాగమైన ఆశావాదాన్ని  అనుభూతి చెందుతాడు.”


 గ్రోస్మాన్ తత్వం మానవ జీవితం పట్ల అతని లోతైన అవగాహన తెలుపుతుంది. ప్రజలు పర ద్వేష భావనకు రెచ్చగొట్టబడి, ఏకగ్రీవంగా ఓటేసి, తమ ఇళ్లల్లోకి  రాబీస్ రానిచ్చి, హత్యాకాండ పట్ల మౌనం వహించి , జైళ్లలో కుక్కబడి అమిత విధేయంగా మారారు. కొందరు మాత్రం తిరగబడ్డారు. నిరంకుశ హింస మూలాన మానవ ఆత్మ పక్షవాత బారిన పడింది.

జన్మ భూమి పేరుతో, సంకుచిత అసిత్వాల పేరుతో ఆత్మ రక్షణ సహ జాతం సమర్థన కు గురయింది. నిరంకుశ రాజ్య హింస మార్మిక ఆరాధనా వస్తువయింది. అంధ ఆశావాదం, తెగించి తిరుగుబాట్లు, మరణ శిక్షలకు నిరీక్షణ, తలారుల పలుకులపై  నమ్మకం చోటు చేసుకున్నాయి.


  రచయిత వార్సా మురికి వాడల్లో తిరుగుబాట్లు, ట్రిబ్లింకా ఇతర శిబిరాల్లో , అణచివేతకు గురయిన దేశాల్లో ఉద్యమాలు,  స్వేచ్ఛకోసం విద్యార్థుల తిరుగుబాట్లు ప్రస్తావిస్తారు. 


 సోవియట్ చరిత్రలో ఉక్రెయిన్ ను బాధలకు గురిచేసిన సామూహిక వ్యవసాయం, మేధావుల మౌనం, వీరుల సాహసం, యూదు వ్యతిరేకత పెరగటం, స్వేచ్ఛ, స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో దేశభక్తి వెల్లువలను రచయిత గొప్పగా  చిత్రించారు.  రచయిత పుస్తకం చాలా కాలం అరెస్టుకు గురై  అతన్ని  కుంగదీసింది.చివరకు 1985 లో పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసింది. అతని తత్వం వ్యక్తులు మనుష్యులుగా జీవించడం, మనుష్యులుగా మరణించడం.  ఈ నవల ఆంగ్ల అనువాదకుడు రాబర్ట్ చాండ్లర్  మాటల్లో ఈ నవల “మానవ స్వభావం గురించిన   ఛేకొవియన్ ఇతిహాసం.’’


 (Published on 12 January,2026 in Maha Daily)




  












No comments:

Post a Comment