Sunday, 20 September 2026

జీవిత ‘శిశిరంలో నిరంకుశుడు’

                                                   

                                        

     

గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్  ప్రపంచ ఖ్యాతి గడించిన , 1982లో  నోబెల్ బహుమతి పొందిన రచయిత. కథలు, నవలలు, పాత్రికేయ వ్యాసాలు ,డాక్యుమెంటరీ నవలా రచనలు చేశారు. సర్రియలిజం, మేజికల్ రియలిజం శైలిలో   ఆయన రాసిన నవల ‘నియంత యొక్క శిశిరం’ ( ది ఆటమ్ ఆఫ్ ది  పాట్రియార్క్) లాటిన్ అమెరికా కు చెందిన పలు   నియంతల జీవిత చరిత్రల అధ్యయనం పై  ఆధారపడి రూపొందించిన అద్భుతమైన  ఊహా చిత్రం. విమర్శకుడు జాన్ కింగ్ రాసినట్లు  లాటిన్ అమెరికా సాహిత్యంలో  అస్తిత్వ అన్వేషణ, మేజికల్ రియలిజానికి  గుండె లాంటి “ఉన్నత” మరియు కింది సంస్కృతుల సమ్మేళనం, బరోక్ (అలంకార సహిత , నాటకీయ, క్రమ రహిత ) శైలిలోని భాష ఉంటుంది.


   లాటిన్ అమెరికాలో డయాజ్ ( మెక్సికో), కబ్రెల్ల (గ్వాటిమాలా), గోమెజ్, జెనేమేజ్ ( వెనిజువేలా), ట్రుజిల్లో ( డొమినికన్ రిపబ్లిక్), సోమోజా( నికరాగువా), Batista ( క్యూబా), ఇంకా  ఫ్రాంకో (స్పెయిన్)లాంటి ఎందరో. ఒక్కొక్కడు ఒక మహా హంతకుడు.తర్వాత కాలంలోప్రజాస్వామ్య రిపబ్లిక్ లు కూలి బ్రెజిల్(1964),  చిలీ, ఉరుగ్వే (1973)అర్జెంటీనా (1976) లు  నియంతృత్వంలో కుమిలిపోయాయి.


   తన రచనల్లో   ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్  సోలిట్యూడ్,’ ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్,’ ‘ లవ్ ఇన్  ది టైమ్ ఆఫ్ కలరా,’ ‘ది జనరల్ ఇన్ హిస్ లేబీరింత్,’ ‘ఇన్ ఈవిల్  అవర్,’ ‘క్రానికల్ ఆఫ్ ఏ డెత్ ఫోర్టోల్డ్,’ ‘ఐస్ ఆఫ్ ఎ బ్లూ డాగ్’, ‘లీఫ్ స్టార్మ్’,’ స్ట్రేంజ్ పిల్గ్రిమస్, ‘ఆఫ్ లవ్ అండ్ ఆదర్ డిమన్స్,’ ‘మెమోరీస్ ఆఫ్ మెలంఖలి   హోర్స్’, ‘న్యూస్ ఆఫ్ కిడ్నాపింగ్’  మొదలగునవి ఉన్నాయి.


    ప్రస్తుత నవల ‘నియంత యొక్క శిశిరం’   అధి వాస్తవిక, కవితా శైలిలో ప్రవాహంలా సాగుతుంది. వాక్యాలు లో కామా, ఫుల్ స్టాప్ లు అరుదుగా ఉంటాయి. సంభాషణ చేస్తున్న వారెవరు అనేది తెలుసుకోదలచిన పాఠకుని గ్రహణ శక్తికి  పరీక్ష. మార్క్వెజ్ నవల్లో అతడు, నేను, నీవు, జనరల్ సార్ అనే పదాలతో వాక్యాలను కలుపుతూ కథ  నడుస్తుంది. కథనం  మొదటి(‘నేను,’ ‘మనం’), రెండవ ( ‘నీవు,’ ‘జనరల్ సార్,’  ‘నా మాత’) ,  మూడవ వ్యక్తి (‘అతడు,’ ‘ఆమె,’ ‘వారు’)  కథనాల్లో మారుతూ  సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పద్ధతి ఉపయోగించాడు.కవితావేశం నయాగరా  జలపాతం . రచయిత ఏడేళ్లు శ్రమించి రచించిన   అక్షర  లావా ప్రవాహం. 


    పేరు లేని రాజ్యంలో(కొలంబియా కోస్టా లేక వెనిజువేలా కావచ్చు)పేరు చెప్పని సైనిక 

 నియంత తన ఇచ్చ వచ్చినట్లు పాలించి, అనుమానంతో తనలాగే ఉండే వ్యక్తిని, అంగ రక్షకుని, తిరుగుబాటు దారులను, ప్రజలను సంహరింప చేసే  విధానాలు, తాను మాత్రం ఈ చావును తప్పించుకుంటానని అవాస్తవిక ఊహలు చేస్తాడు. .  ఏనుగు కాళ్ళ లాంటి పాదాలతో , హెర్నియతో, నిరంతర సైనిక దుస్తులు, మెడల్స్ తో తిరుగుతూ  నియంత క్రూర పాలన,   చిత్త కార్తి కుక్క లాంటి కాముకత్వం, ఆత్మ వంచన, నిఘా కన్నులు, హింసా కాండకు రహస్య అనుమతి , అనివార్యమైన ఏకాంత విచారం,చివరకు శిశిరం లో చెట్టులా మిగిలి  ఒంటరిగా మృతి. అతని శవం రాబందుల పరం. నాటి దాకా భయ భ్రాంతులైన   ప్రజలకు వసంత కాలం.


నియంత   వంద నుంచి రెండు వందల   ఏళ్ళ పైన పాలన ఒక  ప్రతీక.   చర్చి, విదేశీయుల పట్ల వ్యతిరేకత,  మరలా వారికే దేశ వనరుల  అప్పగింత. వారి కనుసన్నల్లో  విలాస జీవనం. భవనం క్రింద ,లోపల మెట్లెక్కే ఆవులు , జంతువులు, పక్షుల పంజరాలు. తోటలో  కుష్టు రోగులు  అతడి సాయం కోసం. అతడికి నచ్చితే కరుణ. కోపమొస్తే  వ్యతిరేకుల,తిరుగుబాటుదారుల బహిష్కారం, దారుణ మరణం.తిరగబడితే  సందర్శనం.జాతి తనే. అన్ని కాలాలు, సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు తానే. తానే దైవాంశ సంభూతుడు. తాను తాకితే జనుల రోగాలు మాయం.వంది  మాగధుల పొగడ్త అతడి  ఆహారం. ‘చనిపోయి’ బ్రతుకుతాడు. బ్రతికుంటే ఇతరుల అంతం చూస్తాడు.తన భార్య, బిడ్డల దుర్మరణానికి ప్రతీకారంగా హింసా కాండ.



అధికారం మీద నియంత, ఇతడి మీద లొంగి ఆధారపడే జనం ఆత్మ న్యూనతా భావన పరస్పరం ప్రభావితం చేసుకుంటారు. అతడు పాపి లేదా కాకి లా  చిరాయువు. ఏకాకి జీవన శైలి. మృత్యు దర్శనం అనివార్యం. అపుడు అయినా అవుతుందా జ్ఞానోదయం? అయినా తిరిగి లేచేనా కూలిన స్వేచ్ఛా విగ్రహం?  ఇదే చరిత్ర విషాదం. వినోదం.


నియంత పేదరికంలో జనిస్తాడు. తల్లి బెండిసివోన్    ఆల్వరాదో పెంటకుప్ప మీద గొర్రె మాంసం  బాలుడి మధ్యాహ్న ఆహారం కోసం ఇచ్చి, తనువు ను అమ్ముకుని పెంచిన కుర్రవాడు రాజధాని

వచ్చి సీసాలు అమ్ముకుంటూ సైన్యంలో చేరి జనరల్ గా ఎదుగుతాడు. బ్రిటీష్ సాయంతో అధికారం  19 వ శతాబ్ది మధ్యలో ఫెడరలిస్ట్ యుద్ధం. అమెరికా మెరైన్స్ చేతిలో 20 వ శతాబ్ది తొలి నాళ్లలో ఓటమి. తన తొలి దశలో తన డూప్ గా  పాట్రిసియో అరగోనే ను పెట్టుకుని పాలన సాగిస్తాడు. అతడు చనిపోగానే తాను పోయినట్లు ప్రచారం చేసుకుని తన మృతి పట్ల ఆనందం పొంది అధికారం కోసం సమావేశమైన వారి పని పడతాడు. తనకు రక్షగా ఉన్న రోడరిగో దె  అగిలార్  తన్ను వంచించాడనే నెపంతో అతడ్ని  చంపి వండి వడ్డించేలా చేస్తాడు. మానువెలా సాంచెత్ అనే వనిత కు  దాసుడై, ఆమె ఆకస్మికంగా వెళ్ళిపోతే పగతో రగిలి ఆమె ఎక్కడా దొరక్క పోతే  వెర్రెక్కి పోతాడు.


తాను ఉన్నా లేనట్టు , లేకున్నా ఉన్నట్లు ప్రజానీకాన నమ్మించి, వంచించి, భయ పెట్టీ వారి కోసమే తన సర్వస్వం అని సృష్టించగలదు.ఇదే మాకీయవెల్లి సైద్ధాంతిక వల.  అధికారం పట్ల ప్రేమ అతడి అణువణువునా ఆవహిస్తుంది. అది నియంతృత్వ భావజాల మాయా జాలం.


నియంత  జీవన  శిశిరంలో తల్లి మృతి , ఆమెని సాధువుగా ప్రకటించాలని వ్యర్థ యత్నాలు, ధిక్కరించిన చర్చి వారిపై ప్రతీకార చర్యలు తీసుకుంటాడు.  సన్యాసినులను నగ్నంగా  పెరేడ్ చేయించి , నచ్చిన లెటిసియ నజరేనో ను అపహరించి, బలవంతంగా ఆక్రమించి , తర్వాత పెళ్లి చేసుకుని బిడ్డను కంటాడు.భార్య ఒత్తిడితో  మళ్లీ దొడ్డి దారిన  మత జనుల్ని తెస్తాడు. వారికి ఎన్నో ఇహ లోక లాభాలు సమకూరుస్తాడు.   ఆమె ప్రభావం పెరిగి, బజారులో నచ్చిన  వస్తువులన్నీ ప్రభుత్వ ఖర్చుతో అనుభవిస్తుంటే కినిసిన వారి కుట్రతో కొడుకుతో సహా వేటకుక్కల దాడిలో అంతమైతే,  నియంతలో  విషాద జనిత క్రోధం జ్వలించి , ఆమె హంతకులను వేటాడే క్రమంలో ఎందరో బలవుతారు. ఈ తరుణంలో నియంత  దరి చేరిన జోస్ ఇగ్నాసియో   సాన్స్ దె  లా బారా అనే యువకుడు అనధికారిక  చిత్ర హింసల భవనంలో నియంత వ్యతిరేకుల హింసించి వారి తలలు కొబ్బరి కాయల్లా  తరిగి సంచుల్లో సరఫరా చేస్తే అవి ఏమో అని తన సౌధంలో  దాచి కుళ్ళు కంపుతో నిజం  తెలిసినా తన బాధ్యత ఏమీ లేదని అందరూ అనుకోవాలని నియంత కోరిక. చివరకు జనం ఆగ్రహ జ్వాలల్లో జోస్ ఇగ్నాసియో సాన్స్ దె  లా బారా  అసువులు పోతాయి. 


   ఐరోపా, అమెరికా  దేశాలు, వాటి దౌత్యవేత్తలు నియంత నుంచి పలు ఆర్థిక రాయితీలు, లాభాలు పొంది అతడ్ని నామ మాత్రంగా చేస్తారు. అతడి భవన  సమీపంలోని  కరీబియన్ సముద్రంపై  హక్కులు అతడి మెడలు వంచి కాజేస్తారు. చివరి దశలో ఈ అధికార , కామినీ మహా  కాముకుడు పాఠశాల బాలికలపై అత్యాచారాలు చేస్తాడు. అతని తొత్తులు, ఆశ్రితులు అంగడి బొమ్మలకు అమ్మాయిల వేషాలు వేసిన వైనం తర్వాతతెలిసి మండిపోతాడు. తన అధికార సౌధంలో అనుమానంతో, ఒంటరి  ఒంటెల బ్రతుకుతూ, తన  కీర్తి తనే టాయిలెట్ గోడలపై రాసుకుంటూ,  పునర్ యవ్వన వాంఛతో తపిస్తూ, ఏకాంతంలో  దయనీయంగా ,అనివార్యంగా చనిపోతే  ఆ వార్త విని నమ్మక , నమ్మలేక చివరకు నమ్మిన జన సందోహ ఆనందోత్సవాలతో నవల ముగుస్తుంది.



   గెరాల్డ్ మార్టిన్ అనే విమర్శకుడు “ఇది అధికారం, కీర్తి, ఏకాంతం పైన లోతైన ఆలోచన " అని, మార్క్వెజ్ దృక్పథం "నిర్దాక్షిణ్య వాస్తవికత  కానీ నిరాశ కాదు"  అని రాశాడు. మరో నోబుల్ బహుమతి గ్రహీత ఆస్టూరియాస్ నవల ‘ది ప్రెసిడెంట్’ లో నియంత అధికారాలు కేంద్రీకృతం చేసుకునీ  సాలెగూడులో పెద్ద సాలెపురుగు లా దూరం నుంచి అదుపు చేస్తున్నట్లు చూపిస్తే  మార్క్వెజ్ నవల నియంత చేతన, ముఖ్య ఉద్దేశాలను ఎక్కువగా పట్టించుకుంటుంది అని  మార్టిన్ అభిప్రాయం.  మార్టిన్ భావనలో మార్క్వెజ్ నవల ‘నూరేళ్ళ ఒంటరితనం’ అతని జీవితానికి సాహితీ కేంద్రమైతే, ‘నియంత యొక్క శిశిరం’ నవల అతని సాహిత్యానికి కేంద్రం, ఇంకా మేలుగా ఇరుసుగా చెప్పవచ్చు.

 


 రెండు నవలల్లో కవితా శైలి ఉన్నా ఆస్టూరియాస్ నవల  అందమైన కట్టడం లాగా  ఆకర్షిస్తే,  మార్క్వెజ్ శైలి  ప్రవాహంలా కొనిపోతుంటుంది. ఈ నవలకు స్థల, కాలాలను దాటిన నిరంకుశ రాజ్యాలకు సంబంధించిన  విశ్వ జనీనత ఉంది. కాకుంటే ఆధునిక నియంతల సాంకేతిక జ్ఞానం, వ్యవస్థల స్వాధీనం, జాతి  ద్వేష భాష, అనుకూల మీడియా   ప్రచార హోరుకు  , మార్క్వెజ్ రచనా కాలం నాటి  స్థితికి  నియంతృత్వ స్థాయిలో  మాత్రమే తేడా కానీ స్వభావంలో కాదు. 

(Published on 31 August,2026, Maha Daily)

  



  



No comments:

Post a Comment