ఎమే సెజైర్ (1913-2008) ఫ్రెంచ్ మార్టినీక్ దీవిలో బాస్-పాయింట్ లో జన్మించారు. తను పారిస్ లో చదువుకుంటున్నపుడు సెంగార్, డమాస్ లతో కలిసి ‘నెగ్రిటూడ్’ ఉద్యమం ఆరంభించాడు. ఇది 1930లలో నల్ల జాతి రచయితలు ప్రారంభించిన సాహిత్య , సాంస్కృతిక ఉద్యమం. వలసవాద వ్యతిరేకంగా ‘ రిటర్న్ టు ది నేటివ్ లాండ్,’ ‘డిస్కోర్స్ ఆన్ కలోనియలిసం,’ ‘ఏ టెంపెస్ట్,’ ‘ఏ సీజన్ ఇన్ ది కాంగో,’ ‘ది ట్రాజెడీ ఆఫ్ కింగ్ క్రిస్టోఫే,’ ‘అండ్ ది డాగ్స్ వర్ సైలెంట్’ తదితర ప్రఖ్యాత రచనలు చేశాడు. ఈ నాడు దేశ దేశాల్లో అణచివేతను వ్యతిరేకించే అందరికీ ఈయన రచనలు స్ఫూర్తి కలిగిస్తాయి.
సెజైర్ ఈ పుస్తకంలో అధికారాన్ని తిరస్కరిస్తూ,తన పట్టణం గురించి, ఇంటి గురించి , నల్ల జాతి అణచివేత గురించి, ఐరోపా చెప్పిన అబద్ధాల గురించి, తిరిగి మేల్కొన్న నెగ్రిటూడ్ ఉద్యమం గురించి , రేపటి రోజున తూర్పున ఉదయించే మార్పు గురించి అత్యంత ఉద్వేగాత్మక, కవితాత్మక, ఆలోచనాశీల శైలిలో రాసిన రచన. మాటల్లో శక్తిని, నల్లవాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని, స్వేచ్ఛ కోసం అతని కలవరింతను చెబుతాడు. అర్థం లేని చావులు విమర్శిస్తూ ,జీవితం కోసం ఆర్తిని , పట్నం గురించి కవి వర్ణిస్తూ నిర్భయంగా, బహిరంగంగా దాని కుళ్ళును వర్ణిస్తాడు.
సెజైర్ ‘ రిటర్న్ టు ది నేటివ్ లాండ్,’ లో తన దేశం కోసం , దాని గాయాల ఒంటరి వికారం కోసం, దానికోసం పలికేందుకు తిరిగి వచ్చాడు.జీవితం ఒక దృశ్యం కాదని, ప్రేక్షకుడిలా నిస్సార దృక్పథం చూపక జాగ్రత్త పడమంటాడు. “నేను వచ్చాను” అని ప్రకటిస్తాడు. తాను చూసే చావు అర్థం , పవిత్రత, గౌరవం లేనిదని, తనకు జీవితాన్ని అంచనా వేసేందుకు హక్కు లేదని అంటాడు. కవి తన దేశం గురించి, తన జాతి గురించి, తమను హేతువు పేరు మీద అణచివేయడం గురించి చెబుతూ తన అస్తిత్వాన్ని సమర్ధించుకుంటాడు.
తాను ఐరోపా నిరాశను, పిరికితనాన్ని విమర్శిస్తూ అందమైన ఇగోయిజం కోరతాడు .కవి తాను చిరు గంటల్లో జరిగిన, ఒరిగిన వస్తుజాలాన్ని, పాత గాయాలను, ఎముకలని, బందీ అయిన అగ్గి కొండల్ని అంగీకరిస్తానంటాడు.తన నెగ్రిటూడ్ సహనం. తమ నల్ల జాతిది ప్రకృతితో సామరస్యం. విజేత తెల్ల జాతిని చూసి జాలిపడాలి.
తనకు మంత్రగాడి నమ్మకం , చేతులకు క్రియాశక్తి , ఆత్మకి కత్తి పదును ఇమ్మని ,దృఢంగా ఉంటానని , ప్రజా ప్రేమికుడిని కావాలని కోరుతాడు. గర్వానికి వ్యతిరేకంగా, శ్రామికునిగా చేయమంటాడు. ద్వేష మనిషిగా చేయొద్దని, విశ్వ ఆకలి ,దాహం తీరాలంటాడు. ఫలవంతమైన జాతి జనించాలంటాడు.కవి తన కొత్త పెరుగుదలను చుట్టూ కప్పుకోమంటాడు. తమ జాతిని ముద్దాడమంటాడు.
.
పట్నం చదునుగా, నిర్జీవంగా , మూగగా.
తెల్లవారుజామున కవి పోలీసులు, అధికార దుస్తులు ఆశగాలాన్ని ద్వేషిస్తాడు. తెల్లవారుజాములో మార్కెట్ కు వెళ్లేందుకు మొలకెత్తిన చేతి సంచులు. సాక్ష్యం చెప్పని అమరవీరులు ,నిశ్శబ్దంలో బాధతో తెరిచే ముసలి పెదాలు.తన ఆకలి బాధ, తిరుగుబాటు గొంతు తానే ఇవ్వని సందడి చేసే గుంపు. ఒంటరిగా ఉండే గుంపు.
ప్రతిదాన్ని , వ్యక్తీకరణను, విముక్తి ప్రదాతను,స్వేచ్ఛను తిరస్కరించే పట్నం. తన్నుతాను తిరస్కరించే పట్నం. కుష్టు, వినియోగం, కరువులు, ప్రకృతిలో భయాల దొంతర. ఎలా పేలాలో మరిచిన, విస్మరించబడిన మోర్న్ పట్నం. దాని మలేరియా రక్తం, నిరోధించిన నిప్పు, ఆకలి
బాధలు, కరువు ఆత్మహత్యలు. ఆకలితో మతి పోయి, సగం నిద్రలోని, పనికిరాని నల్ల పిల్లవాడు గొంతు నుంచి ఒక్క మాట కూడా రాబట్టలేని టీచర్, ప్రీస్ట్ లు. అవినీతి, మూర్ఖత్వం, వ్యభిచారం, హిపోక్రసీ, దురాశ, వక్రత్వం , దిగజారిన తనంతో విరిగిన వారికి సాదా బీచ్. నిజమైన దుఃఖాన్ని కవికి తెలిపే సుదూర ఆనందం .సముద్రం యొక్క గొప్ప హిస్టరీకల్ నాలుక.
కాలం గడిచి క్రిస్మస్ వచ్చింది. బాగా పండిన దానిమ్మ పండు లాంటి అకస్మాత్తు అందం. నిరంతర కలకలం. నల్ల వారి సర్వాంగాల సంగీతం. అవినీతి, మూర్ఖత్వం, వ్యభిచారం, హిపోక్రసీ, దురాశ, వక్రత్వం , దిగజారిన తనంతో విరిగిన వారికి సాదా బీచ్. నిలబడి నిరసనతో ఆకాశాన్ని చీల్చే అత్యంత స్వల్ప కోరిక లేకుండా, మొహంపై బోర్లా పడిన జీవితం.
క్రూరమైన చిన్న ఇల్లు
ఆరుగురు సోదరులు, సోదరీమణులు .తండ్రి అనూహ్య స్పందన. ఆకలి కోసం సదా సింగర్ మెషిన్ తొక్కే అమ్మ కాళ్ళు. ఈ పాయూ వీధి ఈ పట్టణ మర్మ అవయవాల్లా జుగుప్సాకరమైన తోక.సముద్ర చెత్తను వదిలే బీచ్ కు ఆనుకున్న వీధి… బాధ పడే మనిషిని.. ఎవరికీ జవాబుదారీ కాకుండా చంపవచ్చు… కానీ పశ్చాత్తాపాన్ని చంపగలమా?
నల్ల జాతి వీరుల ప్రశంస
టుసాన్ లూవెర్త్యూర్. చావు అతని తల మీద తేజ వలయం / తార. తన చేతుల చెరకు తోటలో వీచే పిచ్చి గాలి, తెల్ల గుర్రంలా జైల్లో పరిగెత్తుతూ, చీకటిలో పిల్లికళ్ళు లా మెరుస్తూ, సముద్రపు దిబ్బ కింద నీటిలా గుటకలేస్తూ, గాయపడిన పక్షి, తగ్గుతూ, సందేహిస్తూ , నిశ్శబ్ద తెల్లగుంటలో మరణిస్తుంది.
“మేము మాట్లాడాలి. మేము పాడాలి. మేము అరవాలి.” చెట్టును చూసి చెట్టు అయ్యాను. కాంగో గురించి యోచించి అడవులలో నిద్రలో సవ్వడి చేసే కాంగోను అయ్యాను .
నా నేరాలు ప్రకటిస్తా, నా తరఫున చెప్పేది ఏమీ లేదు. చంపాను దేవుణ్ణి నా సోమరితనంతో నా మాటలు , సంజ్ఞలు ,నా బూతుపాటలతో…
వూమ్ రో వా. పాముల్ని ఆడించేందుకు, అలలు దాటు నిమిత్తం వానను ఆపేందుకు. రహదారిపై చెరుకు తినే కుర్రవాడిని, రక్తదారిపై గొంతు చుట్టూ ఉరితాడు మనిషిని, ఒక పెద్ద సర్కస్లో నిలబడిన నా నల్ల నుదురుపై ఉమ్మెత్త పూల కిరీటం…
వూమ్ రో వా. ఎవరు నా గొంతు నొక్కింది? నీవే. నూరేళ్ల కొరడా. నూరేళ్ల ఓర్పు. నాకోసం నీవు సర్దుకో. నీకోసం నన్ను నేను సర్దుకోను.
శతాబ్దాల పాటు నల్ల వారిని జంతువులుగా, నడిచే ఎరువుగా, బానిసలుగా చూశారు. పేదరికం వారిని పరిమార్చింది. రైలులో ఒక అలసి సొలసిన నీగ్రో ని చూసి నవ్వుతున్న ఆడవారితో కలిసి తాను చిరునవ్వు నవ్వినందుకు, నేరంలో భాగమైనందుకు పిరికి తనంచూసి మొహంపై వుమ్మేయమని డిమాండ్ చేస్తున్నా..
నేను అంగీకరిస్తా
చిమ్మిన రక్తం జామెట్రీ తో రంగు వేయబడ్డ జాతి జాగ్రఫీని అంగీకరిస్తాను అని. నెగ్రిటూడ్ ఏమాత్రం శిరో సూచిక కాదు. నిరాశామయ చేతుల్లో క్షతగాత్రమైన దేశం. అకస్మాత్తుగా జవసత్వాలు ఎద్దులా కుమ్మాయి. జీవన తరంగం మోర్న్ పట్న స్తనంపై పారింది. సిరల్లో కొత్త రక్తం. తుఫానులా పెద్ద శ్వాస కోశాల్లో బ్రీతింగ్.
శతాబ్దాలుగా ఐరోపా చెప్పిన అబద్ధాలు. ఏ జాతికి అందం, తెలివి, బలంపై లేదు ఏక స్వామ్యం. ఇక సూర్యుడు తిరగాలి తమ భూమి చుట్టూతా. ప్రతితార భూమిపై రాలేదీ,ఆగేది తమ ఆజ్ఞను బట్టి. దేశం ప్రాచీన బాంబ్రాల రాత్రి బల్లెం.
బహు మంచి ‘నీగ్రో’ అంటే విధిని ఎదిరించలేక, దయలేని దేవుడు విధించిన ఆంక్షలు పాటిస్తూ తన విలువ లేని తనాన్ని నిజాయితీగా నమ్మి చెరకు తోటలో పనిచేసేవాడు. అతని మీద గాయాలు. పాత నెగ్రిటూడ్ శవమే అయింది. మాట్లాడేది ఎందుకంటే మరో సాగరం తరించేందుకు, ఊపిరి తిత్తులు నవకల్పనకు, మరో ఉన్మాదికి స్వేచ్ఛ కోసం, ఆత్మ ప్రకాశించేందుకు.
సామ్రాజ్యవాద దురాక్రమణకు ఇరాక్, ఇరాన్, వెనిజులా, క్యూబా మొదలగు దేశాల వారికే కాక కుల, మత, జాతి, లైంగిక అణచివేతకు బాధపడే జనులకు నేటి తరుణంలో సెజైర్ రచన ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది.
No comments:
Post a Comment