Tuesday, June 2, 2020

లోకం వేసింది ఒక అడుగు వెనక్కి 
మృత్యులోయ అంచుల్లో నుంచి
 హాయిగా ఆనందిస్తున్నాయి
తరువులు, చిరు ప్రాణులు, మూగజీవులు
చావు భయం లేక ఆటాడుకుంటున్నాయి 

ఆగామి తరాలను మరిచి
అంతరాలను పెంచి
అసుర సంపద సంచయంలొ
అమ్మ పాలు తాగి ఆ రొమ్ము గుద్దిన 
అంధ మానవ జాతికి 
అక్షులు తెరుచుకున్నాయి

శబ్దంలోనో , నిశ్శబ్దంలోనో
 శతకోటి యుగాల పూర్వం 
పురుడోసుకుని
పరిణమించిన ప్రపంచానికి 
మరణ శాసనం వ్రాసే హక్కు నీ కెక్కడిదని
నిలదీసి అడిగింది భూమాత. 

రోజూ మిల మిల మెరిసే సూర్యోదయం 
ఇచ్చే ఆనందాన్ని
మనసారా అనుభవించలే ని అర్భకుడవంది .

ముసిరిన భయజలద పటలి నిముషంలో చెదిరింది 
వెలుగు అంచులతో నిలిచింది వెంటనే
ఆ దృశ్యమూ అదృశ్యమై
నిర్మలాకాశాన నెలవంక వెలిగింది
ఎనలేని సంతోషం హృదయకలువలా విరిసింది.

 నిత్య పరివర్తన మన మతంగా, అభిమతంగా మారాలి
అరకొర  సిధ్ధాంతాలు, అనవసర రాధ్ధాంతాలు మానాలి
అమృతత్వమే మన పరమార్థమని ఎరగాలి

మనిషి లేకున్నా ప్రకృతి చిరకాలముండేను
ప్రకృతి వినా మనిషి క్షణకాలాన ఒరిగేను.

No comments:

Post a Comment